
‘శ్యామ్ సింగరాయ్’ రివ్యూ
మంచి.. ముస్తాబు అయ్యి చెప్పులేసుకునేలోపు.. చెడు లోకం మొత్తం చుట్టొస్తుందనేది నాని సినిమా విషయంలో నిజం అయ్యింది. ‘శ్యామ్ సింగరాయ్’సినిమా ప్రమోషన్స్ పాజిటివ్గా సాగిపోగా ఆడియన్స్లో పెద్ద ఇంపాక్ట్ కనిపించలేదు. ఎప్పుడైతే ప్రభుత్వంపై నాని నెగిటివ్ కామెంట్స్ చేశారో అందరి దృష్టి ‘శ్యామ్ సింగరాయ్’ వైపుకి మళ్లింది. ఈ సినిమాను ఓ చూపు చూడాల్సిందే అని అనుకున్న వాళ్లు కొందరైతే.. తప్పకుండా చూడాల్సిందే అనుకున్నవాళ్లూ ఉన్నారు. వివాదాలు విమర్శల నేపథ్యంలో థియేటర్స్లో విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
శ్యామ్ సింగరాయ్ ఇదో విప్లవాత్మక ప్రేమగాథ.. విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా కథలోకి వెళ్లాలంటే ఓ యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.. వెస్ట్ బెంగాల్లోని కాళికా పూర్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వాసుదేవ్ గంటా (నాని) షార్ట్ ఫిల్మ్ ద్వారా పెద్ద సినిమా అవకాశాన్ని అందుకుంటాడు. తన పదేళ్ల కష్టాన్ని నిజం చేసుకుంటాడు. ‘ఉనికి’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు. ఆ సినిమా మెచ్చి వాసుకి బాలీవుడ్ ఆఫర్ కూడా వరిస్తుంది. సరిగ్గా అదే టైంలో వాసు కాపీ రైట్ ఇష్యూతో అరెస్ట్ అవుతాడు. వాసు రాసిన కథలన్నీ 1970లో తన రచనలతో ఈ దేశాన్ని, ప్రభుత్వాలను కదిలించిన బెంగాలీ లెంజండరీ రైటర్ శ్యామ్ సింగరాయ్వే. తన ప్రమేయం లేకుండా వాసు ఈ కథలన్నీ రాస్తుంటాడు. ఇంతకీ వాసు రాసిన ఒరిజినల్ కథలకి.. శ్యామ్ సింగరాయ్ కథకి నేపథ్యం ఏంటి? ఈ రెండూ ఒక్కటే ఎలా అయ్యాయి? అసలు ఈ శ్యామ్ ఎవరు? వాసు ఎవరు.. వీరిద్దరి ఉన్న సంబంధం ఏంటి? మరి కమ్యునిస్ట్ భావజాలమున్న శ్యామ్ దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది? దేవదాసీ మైత్రి ( సాయి పల్లవి)తో శ్యామ్ ప్రేమకథేంటి? అన్నది తెరపై చూడాల్సిందే. మనం బతికి ఉండగానే శరీరం నుండి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే ‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్’. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఈ సైంటిఫిక్ థియరీతో ‘టాక్సీవాలా’ అనే చిత్రాన్ని రూపొందించిన రాహుల్ సంకృత్యాన్ మరోసారి ప్రయోగాత్మక పంథాలోనే వెళ్లారు. పునర్జన్మల నేపథ్యంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కథని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
కథలో దమ్మున్నప్పుడే ఇలాంటివి పీరియాడికల్ డ్రామా కథల జోలికి పోవాలి. సత్యదేవ్ జంగా రాసిన ఎపిక్ లవ్స్టోరీని రాహుల్ సంకృత్యాన్ బాగా డెవలప్ చేశారు. సత్యదేవ్ జంగా అందించిన ఈ కథలో మంచి డెప్త్ ఉంది. నానిని వాసు అనే దర్శకుడిగా.. కమ్యునిస్ట్ భావజాలమున్న శ్యామ్ సింగరాయ్గా రెండు భిన్నమైన పాత్రల్లో డిఫరెంట్గా చూపించారు. వాసు కథ వర్తమానంలో సాగుతుంటే.. శ్యామ్ కథ 70ల నేపథ్యంలో సాగుతుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రతి ప్రేముకి క్లాసిక్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. ప్రధానంగా ఈ శ్యామ్ కథ చుట్టూనే మొత్తం సినిమా కథ నడుస్తుంది. చెడుకు వ్యతిరేకంగా పోరాడే రెబల్ రైటర్ పాత్రలో నాని చాలా పవర్ ఫుల్గా చూపించారు దర్శకుడు. కులవ్యవస్థ, బానిసత్వం, దేవదాసీ వ్యవస్థలపై సమాజానికి షార్ప్గా సందేశం ఇచ్చారు. ‘మేం గుడిలో స్థూపాంలం కాదు.. మానం ఉన్న మనుషులం మీ మీద ఎవరికీ హక్కులేదు.. ఆ దేవుడికి కూడా..’.. ‘సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది’.. ‘ప్రతి ఆడది ఒక గర్భగుడే’.. లాంటి డైలాగ్స్ ఆలోచింపచేసేవిధంగా ఉన్నాయి. సీన్లకు మరింత బలాన్నిచ్చాయి.
ఫస్టాఫ్లో వాసు దర్శకుడు కావడం.. వాసుతో కృతిశెట్టి లవ్స్టోరీ క్యూట్గా అనిపిస్తుంది. ఆ కథలోనే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ నడిపిస్తూ.. సూపర్ న్యాచురల్ పవర్ని ఇంట్రడ్యూస్ చేయడం.. వాసు పునర్జన్మ తాలూకు జ్ఞాపకాలు వెంటాడటం లాంటి ఒక్కో అంశం డెవలప్ అవుతూ కథ సాగుతుంది. క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ సరైన ముగింపు అనేట్టు చేస్తుంది. అయితే చివర్లో కాస్త నాటకీయత ఎక్కువైనట్టుగా అనిపించినప్పటికీ కథను ఎక్కడా తడబాటు లేకుండా చెప్తూనే.. ప్రేక్షకులలో అసహనం అనేది రాకుండా చూసుకున్నాడు.
నాని ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. వాసు పాత్రను చాలా అలవోకగా చేసేశారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో కావడంతో ఆ పాత్రను బాగా ఓన్ చేసుకున్నారు. ఇక శ్యామ్ సింగరాయ్గా రెబల్ పాత్రలో ఇరగదీశాడు. సెకండాఫ్ స్టార్టింగ్ సీన్ అదిరిపోయింది. అంటరాని వాళ్లు బావిలో నీళ్లు తాగకూడదనే ఆచారాన్ని మట్టుపెడుతూ.. హీరోయిజం చూపించిన తీరు ఆకట్టుకునేట్టు ఉంది. ఆ సీన్లో మంచి మెసేజ్ ఉంది. ఆడది ఎవరికీ దాసి కాదు.. దాస్యాన్ని కోరుకునే వాడు దేవుడు అయితే.. దేవుడి ముసుగులో సాగుతున్న బానిసత్వమే దేవదాసీ వ్యవస్థ అంటూ హీరోయిన్ని ఆ బానిసత్వం నుంచి విడిపించే సీన్ హైలైట్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసిగా కెరియర్లో గుర్తిండిపోయే క్యారెక్టర్ చేసింది. ఆమె పాత్రని పరిచయం చేసిన తీరు అభినందనీయం. క్లైమాక్స్లో ఆమె లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతారు. క్లాసికల్ డాన్స్లో తనకు తానే సాటి అనేట్టు చేసింది. దేవదాసిగా ఉన్న మైత్రీ.. రోజీగా మారిన తీరు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. శ్యామ్-రోజీల మధ్య భావోద్వేగ సీన్లు ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. అయితే సాయి పల్లవి పాత్రకు మరింత స్కోప్ ఇస్తే బాగుండని అనిపిస్తుంది.
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఉన్నంతలో పర్వాలేదనిపించింది. లాయర్గా మడోన్నా సెబాస్టియన్ స్కోప్ ఉన్న పాత్రలో నటించింది.
ఇలాంటి పీరియాడికల్ సినిమాని తెరపై ఆవిష్కరించడానికి మంచి కథ.. నటీనటులు ఉంటే సరిపోదు. గత కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించగలిగే సాంకేతిక నిపుణులు కావాలి.. ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్.. ఈ చిత్ర విషయంలో ఇవన్నీ చక్కగా కుదిరాయి. నిజంగా 1970ల కాలంలో బెంగాల్లో ఉంటే ఎలా అనిపిస్తుందో.. అచ్చంగా అదే అనుభూతికి లోనవుతారు ప్రేక్షకులు. అవినాష్ వేసిన అంతర్ మహల్ సెట్.. రియలిస్టిక్గా అనిపిస్తుంది.